Thursday, July 2, 2015

8వ ఘంటసాల ఆరాధనోత్సవాలు & 5 వ బాలూ సంగీతోత్సవాలు దిగ్విజయం



అమెరికాలో జూన్ 6 నుండి 28, 2015 వరకూ పన్నెండు నగరాలలో
8వ ఘంటసాల ఆరాధనోత్సవాలు & 5 వ బాలూ సంగీతోత్సవాలు దిగ్విజయం
గత ఎనిమిది సంవత్సరాల మా ఉత్తమ సాంప్రదాయాన్ని పాటిస్తూ అలనాటి అమర గాయకుడు ఘంటసాల వెంకటేశ్వర రావు  గారి మధుర గీతాలు, ఈ నాటి గాన గంధర్వుడు ఎస్.పి. బాల సుబ్రహ్మణ్యం గారి  అపూర్వ గానామృతాన్ని మేళవించి,  వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా రూపొందించిన 8వ ఘంటసాల ఆరాధనోత్సవాలు &
5వ బాలూ సంగీతోత్సవాలు అమెరికాలో 12 నగరాలలో దిగ్విజయంగా ముగిశాయి. జూన్, 6 నాడు లాస్ ఏంజెలేస్ లో మొదలయిన ఈ సంగీత విభావరి ఫీనిక్స్, ఆల్బనీ, న్యూ జెర్సీ, న్యూ యార్క్, పిట్స్ బర్గ్,  అట్లాంటా, రాలీ, శాన్ ఏంటోనియో, హ్యూస్టన్, ఆస్టిన్, డాలస్ నగరాలలో జూన్ 28 దాకా జరిగాయి. స్థానిక తెలుగు సంస్థల అద్వితీయమైన సహకారంతో భారత దేశం నుంచి “అపర ఘంటసాల”  శ్రీ తాతా బాల కామేశ్వర రావు (హైదరాబాద్), తొలి అమెరికా పర్యటన లో “స్వరనిధి” శ్రీ పి.వి. రమణ (కాకినాడ), హ్యూస్టన్ నివాసి “గాన రత్న” శ్రీమతి శారదా ఆకునూరి ప్రధాన గాయకులుగా అమెరికా లో అసంఖ్యాకమైన  శ్రోతలకి వీనుల విందు చేశారు.
1988 లో “శిరోమణి” శ్రీ వంశీ రామరాజు గారిచే సంస్థాపించబడిన వేగేశ్న ఫౌండేషన్ (హైదరాబాద్) అనే లాభాపేక్ష లేని వికలాంగ బాల బాలికల సంక్షేమ సంస్థ నిర్వహణ ఖర్చుల నిమిత్తం విరాళాల సేకరణ కోసం నిర్వహించబడిన ఈ సంగీత విభావరి కార్యక్రమాలకి అన్ని నగరాలలోనూ శ్రోతలు విశేషంగా స్పందించి సుమారు లక్ష డాలర్లు విరాళంగా సమర్పించి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు.
తమ గాన మాధుర్యంతో అందరినీ అలరించిన శారద ఆకునూరి (హ్యూస్టన్) కి “గాన కోకిల”, తాతా  బాల కామేశ్వర రావు (హైదరాబాద్)  కి “గాన సమ్రాట్” అమెరికా లో తొలి సారి పర్యటించిన పి.వి. రమణ (కాకినాడ) కి “గాయక సార్వభౌమ” బిరుదులని వేగేశ్న సంస్థ సంస్థాపకులు వంశీ రామరాజు, కార్యక్రమ జాతీయ సంచాలకులు వంగూరి చిట్టెన్ రాజు హ్యూస్టన్ కార్యక్రమంలో బిరుదు ప్రదానం చేశారు. కృష్ణ కీర్తి తీసిన ఆ కార్యక్రమం ఫోటోలు ఈ క్రింద లంకెలో చూడవచ్చును.  

మాతో ఎంతో సహకరించి, ఈ కార్యరమాలని దిగ్విజయం చేసిన ఆయా నగరాల నిర్వాహకులకీ, విరాళాలు ఇచ్చి ప్రోత్సహించిన దాతలకీ మా హృదయ పూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.
                                                        భవదీయులు
వంగూరి చిట్టెన్ రాజు (అమెరికా జాతీయ సమన్వయ కర్త)
శారద ఆకునూరి (సమన్వయ కర్త)
వంశీ రామరాజు (అంతర్జాతీయ సమన్వయ కర్త, వేగేశ్న సంస్థ నిర్వాహకులు)